Last Updated:
ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ జనాభా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన చేశారు. అమరావతిలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పని చేసే యువత సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనాభా తగ్గుదల కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో రాష్ట్రంలో వృద్ధులే అధికంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.
ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు.
చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఫెర్టిలిటీ రేటు సుమారు 1.5గా ఉంది. గతంలో 1993లో ఇది 3.0గా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఈ రేటు ఇలాగే తగ్గుతూ పోతే పని చేసే వయస్సు గల ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని చెప్పారు. అలా జరిగితే ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి సుమారు 6.70 లక్షల జననాలు నమోదవుతున్నాయని సీఎం తెలిపారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో సుమారు 23 శాతం మంది వృద్ధులే ఉండే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇది భవిష్యత్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మహిళల ఉపాధి భాగస్వామ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 31 శాతంగా ఉందని, ఇది 59 శాతానికి చేరితే రాష్ట్ర స్థూల ఆర్థిక వృద్ధి 15 శాతం వరకు పెరిగే అవకాశముందని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదు అంచెల “లైఫ్ సైకిల్” విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని అనే ఐదు ప్రధాన స్తంభాల ఆధారంగా ఈ విధానం రూపొందించబడిందని చెప్పారు. మహిళలు గర్భధారణ దశ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో ప్రభుత్వం సహాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
పిల్లలు కనాలనుకుంటున్నా వైద్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న దంపతులకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించనుంది. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి పీపీపీ మోడల్లో సబ్సిడీతో ఐవీఎఫ్ సేవలు అందించే యోచనలో ఉన్నామని సీఎం తెలిపారు.
అదేవిధంగా అనవసరమైన సిజేరియన్ శస్త్రచికిత్సలు తగ్గించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ప్రస్తుతం 8.8 శాతంగా ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం కంటే తక్కువకు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పిల్లలను కంటున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. శిశువు జననం సమయంలో రూ.25 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రతి నెల రూ.1000 చొప్పున మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. జనాభా సమతుల్యతను కాపాడుకోవాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



