Last Updated:
GVMC విశాఖపట్నం పరిశుభ్రతకు No Bins No Trade నినాదంతో Zero Waste Institution లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా కఠిన పారిశుధ్య నియమాలు అమలు.
విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులందరూ విధిగా పారిశుధ్య నియమాలను పాటించేలా “నో బిన్స్ – నో ట్రేడ్” (No Bins – No Trade) అనే నూతన నినాదాన్ని తెరపైకి తెచ్చింది. శనివారం మధురవాడ జోన్ ఎండాడలోని ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్ ప్రాంగణంలో జరిగిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వ్యాపారస్తులు, వివిధ సంస్థల బాధ్యతను గుర్తు చేస్తూ జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, ఎస్.ఎస్. వర్మ సంచలన ప్రకటన చేశారు. ఇకపై నగరంలో డస్ట్ బిన్ (చెత్త బుట్టలు) లేని వ్యాపార సంస్థలు కార్యకలాపాలు సాగించడానికి వీల్లేదని వారు స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించింది.
జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్లే లక్ష్యం: నగరంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ తనను తాను “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్” (Zero Waste Institution) గా మార్చుకోవాలని అధికారులు సూచించారు. విద్యా సంస్థలు, వైద్యశాలలు, హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు, చిన్న, పెద్ద వాణిజ్య సముదాయాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వ్యర్థాలను బయట పారవేయకుండా, సంస్థ ప్రాంగణంలోనే ఆన్-సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని చెత్తను ఎరువుగా మార్చుకోవాలని కోరారు.
వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా బ్లూ (పొడి చెత్త), గ్రీన్ (తడి చెత్త) రంగు డస్ట్ బిన్లను అందుబాటులో ఉంచాలి. “మన చెత్త – మన బాధ్యత” అనే నినాదంతో ప్రవేశపెట్టిన ఈ క్యాంపెయిన్ ద్వారా, చెత్త బుట్టలు లేని దుకాణాలపై నిఘా ఉంచడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే వ్యాపార అనుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
నగర ప్రజలు తమ ఇళ్లలో చెత్తను కేవలం రెండు రకాలుగా కాకుండా, నాలుగు రకాలుగా విభజించి జీవీఎంసీ వాహనాలకు అందజేయాలని అధికారులు కోరారు. గ్రీన్ బిన్: తడి వ్యర్థాలు (ఆహార పదార్థాలు, కూరగాయల తొక్కలు). బ్లూ బిన్: పొడి వ్యర్థాలు (ప్లాస్టిక్, పేపర్, మెటల్). రెడ్ బిన్: శానిటరీ వేస్ట్ (డైపర్లు, మాస్కులు, శానిటరీ ప్యాడ్లు). బ్లాక్ బిన్: ప్రమాదకర వ్యర్థాలు (కెమికల్ బాటిల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వేస్ట్).
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, దేశంలోనే విశాఖ నగరం ప్రథమ స్థానంలో నిలిచేందుకు పారిశుధ్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖకు అగ్రస్థానం దక్కాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు. అనంతరం అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. “నో బిన్స్ – నో ట్రేడ్” పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులను అధికారులు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



