“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..:
ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన అమరావతి సాధించిన విజయమని అభివర్ణించారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలకు, వారి శాంతియుత పోరాటానికి దక్కిన దైవ ఆశీస్సులే ఈ ఫలితమన్నారు. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం.. చరిత్ర, సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా శాశ్వతంగా నిలిపిందని లోకేష్ కొనియాడారు. “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అని ఉద్ఘాటించారు.


