Last Updated:
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో జరిగిన తప్పుకు బాధ్యులైన వారు తప్పకుండా ఫలితం అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
సంగం డెయిరీ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను ధూళిపాళ్ల ఖండించారు. 33 రోజుల పాటు జైలులో ఉంచి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించారని, సంస్థలో ఎలాంటి అక్రమాలు ఉన్నాయా అని పూర్తిగా పరిశీలించినా ఒక్క తప్పూ బయటపడలేదని ఆయన అన్నారు. తనపై ఇప్పటికీ 22 కేసులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం వాటిని సమీక్షించి నిజం బయటపెడితే ఆ కేసులను ఎత్తివేయాలని కోరారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనకు చెందిన మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో భారీ మొత్తాలు ఇచ్చారని ధూళిపాళ్ల ఆరోపించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీకి సుమారు రూ.307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని ఆయన అన్నారు. అదేవిధంగా భారతీ సిమెంట్స్ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి మూడు లక్షల టన్నులకుపైగా సిమెంట్ మాయమైందని విమర్శించారు.
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మాట్లాడుతూ, లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు మరియు వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) నివేదికలు సూచించాయని తెలిపారు. కల్తీ నెయ్యి ద్వారా వచ్చిన అక్రమ సొమ్ములో రూ.12.5 కోట్లు విజయవాడకు, రూ.7.5 కోట్లు చెన్నైకు చేరినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికలో వెల్లడైందని ఆయన చెప్పారు. బహిరంగ మార్కెట్లో వెన్న ధర రూ.360 ఉండగా, రూ.316కే నెయ్యి సరఫరా ఎలా చేశారో వైసీపీ నేతలు ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.
ఇక సంగం డెయిరీ పాత్రపై కూడా ధూళిపాళ్ల వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే టెండర్ను రాజకీయ ఒత్తిడితో ఇవ్వలేదని, నిబంధనలు మరియు సాంకేతిక పరీక్షల ప్రకారం టెండర్ ప్రక్రియలో పాల్గొని సంగం డెయిరీ ఎంపికైందని చెప్పారు. గతంలో కూడా 2020, 2021 సంవత్సరాల్లో టెండర్ ప్రక్రియలో సంస్థ పాల్గొన్నట్లు గుర్తుచేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా సంగం డెయిరీ ఎదురు చూసిందని, ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని తెలిపారు.
సంగం డెయిరీ గుంటూరు జిల్లాకు చెందిన రైతుల సహకారంతో నడుస్తున్న సంస్థ అని, చిత్తూరు జిల్లాలో మహిళలు నిర్వహిస్తున్న శ్రీజ డెయిరీ కూడా రైతు ఆధారిత సంస్థలేనని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన పాల ఉత్పత్తుల విషయంలో అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో మంచి పేరున్న సంస్థగా సంగం డెయిరీ నిలుస్తుందని అన్నారు.
పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన తప్పును వైసీపీ నేతలు ఇతరులపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తిరుమల వెళ్లి స్వామివారి వద్ద తమ తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



