AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో 55 అంశాలకు ఆమోదం తెలిపింది. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు, విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ, పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Rapid Read
News18
News18

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత వాటికి పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ప్రస్తుతం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ఇన్నోవేషన్‌ను జత చేస్తూ ‘సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అనే సరికొత్త శాఖను ఏర్పాటు చేయాలని మంత్రిమండలి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటూ, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ఈ కొత్త శాఖ ప్రధాన ఉద్దేశం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా సీఆర్డీఏ, ఎస్‌ఐపీబీ ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ తాజా నిర్ణయాలతో ఏపీ భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మరింత వేగంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

ఇక కేబినెట్ సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఆమోదించారు. ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

విశాఖపట్నంలో దాదాపు రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కేబినెట్ భేటీలో మరో విశేషం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల ఖరారు అంశానికి కూడా సానుకూలంగా స్పందించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తలపెట్టిన వివిధ మౌలిక వసతుల పనులకు సైతం కేబినెట్ ఆమోదం లభించింది.

ఈ సమావేశం పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సమస్యలపై మంత్రులతో చర్చించారు. రాజమండ్రిలో కల్తీ పాల ముఠా ఆగడాలు, శ్రీకాకుళంలో విజృంభించిన డయేరియా వ్యాధి గురించి ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ఘటనలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలని సీఎం సూచించారు. మంత్రులంతా తమ విభాగాలకు సంబంధించిన సమాచారంతో సభకు పూర్తి సన్నద్ధతతో రావాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను శాసనసభ వేదికగా ప్రజలకు విపులంగా వివరించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. అవసరమైతే అసెంబ్లీలో జరిగే ఈ చర్చల్లో తాను, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పాల్గొంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *