లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం


21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలు
నెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరిక

వయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై జరిగిన చర్చలో ప్రియాంక మాట్లాడుతూ.. తరచూ బీజేపీ విమర్శించే నెహ్రూ ప్రస్తావనను తెలివిగా వాడుకున్నారు. ‘మహిళా హక్కులకు పునాది వేసింది నెహ్రూ అనే వ్యక్తి. కంగారుపడకండి.. మీరు భయపడే జవహర్‌లాల్ నెహ్రూ గురించి నేను చెప్పడం లేదు, ఇది చరిత్ర’ అంటూ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్‌ను ప్రస్తావించారు. 1928లోనే మహిళలకు సమాన హక్కుల ప్రతిపాదన జరిగిందని, 1931లో సర్దార్ పటేల్ అధ్యక్షతన కరాచీ సెషన్‌లో తీర్మానం నెగ్గిందని ప్రియాంక గుర్తుచేశారు.ప్రసంగం మధ్యలో హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘మీ వ్యూహాలు, ప్రణాళికలు చూస్తుంటే, ఒకవేళ ఈ రోజు చాణక్యుడు బతికి ఉంటే ఆయనే షాక్‌కు గురయ్యేవారు’ అని ప్రియాంక అనగానే, అమిత్ షా గట్టిగా నవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.అదే సమయంలో, మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై ప్రియాంక తీవ్రంగా విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే దేశంలో ప్రజాస్వామ్యమే మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రసంగం ముగిసే సమయానికి సభలోకి వచ్చిన సోదరుడు రాహుల్ గాంధీ, ప్రియాంకను అభినందిస్తూ ‘ఇదే వేగాన్ని కొనసాగించు’ అని ప్రోత్సహించారు. మొత్తంమీద, తన తొలి ప్రసంగంతోనే ప్రియాంక గాంధీ లోక్‌సభలో ఒక బలమైన గొంతుకగా నిలవనున్నారనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *