Last Updated:
త్రిపురాంతక స్వామి దేవాలయం విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఉంది. మహాభారతంతో సంబంధం ఉన్న ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్షేత్రంగా త్రిపురాంతక స్వామి దేవాలయం నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక విశేషాలతో భక్తులను, పరిశోధకులను సమానంగా ఆకర్షిస్తోంది. శ్రీ స్వర్ణాకర్షణ రాజరాజేశ్వరీ సమేత త్రిపురాంతక స్వామివారు ఇక్కడ కొలువై ఉండగా, ఈ క్షేత్రం గురించి అనేక ఆసక్తికర విషయాలను ఆలయ అర్చకులు వెల్లడించారు.
పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని “జమ్మి”గా పిలిచేవారని, జమ్మి వృక్షాలు విస్తారంగా ఉండటంతో ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు. కాలక్రమేణా “జమ్మి” అనే పేరు “జామి”గా మారింది. ఈ ప్రాంతం పచ్చని ప్రకృతి మధ్యలో ఉండటం, పురాతనతను ప్రతిబింబించే నిర్మాణ శైలి కలిగి ఉండటం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
ఈ ఆలయంలో త్రిపురాంతక స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు. గర్భగుడిలోనే రాజరాజేశ్వరీ అమ్మవారు కొలువై ఉండటం విశేషం. ముఖ్యంగా స్వామివారి లింగం లోతు సుమారు 174 అడుగుల వరకు ఉంటుందని పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే అమ్మవారి విగ్రహం గాంధర్వ శిల్ప శైలిని పోలి ఉండటంతో పాటు దాదాపు 2500 సంవత్సరాల ప్రాచీనత కలిగినదిగా భావిస్తున్నారు.
స్థలపురాణం ప్రకారం ఈ ఆలయానికి మహాభారతంతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు చెబుతారు. ధర్మరాజు స్వయంగా ఈ అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించాడని, ఆలయంలోని జనార్ధన స్వామిని కుంతీదేవి ప్రతిష్టించిందనే విశ్వాసం ఉంది. అరణ్యవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి వృక్షంలో దాచినట్లు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతం పాండవుల అడుగుజాడలతో ముడిపడి ఉందని భావిస్తున్నారు.
జామి పరిసర ప్రాంతాల గ్రామాల పేర్లకూ మహాభారతపు గాథలతో సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. భీమసింగ్ గ్రామం భీముడు యుద్ధం చేసిన ప్రదేశంగా, అలమండ గ్రామం ఆవులు మేపిన ప్రాంతంగా, బీమాలి గ్రామం భీముడు వంట చేసిన పాత్రలు లభించిన ప్రదేశంగా ప్రచారంలో ఉన్నాయి. అలాగే జాగారం గ్రామం శివరాత్రి జాగారం చేసిన ప్రదేశంగా, కొట్టం గ్రామం పశువుల కొట్టంగా, శృంగవరపు కోట ప్రాంతం కీచకుడి సామ్రాజ్యంగా పూర్వం ప్రాచుర్యం పొందిందని విశ్వాసాలు చెబుతున్నాయి.
చారిత్రక ఆధారాల పరంగా కూడా ఈ ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. చోడ గంగ దేవుడు క్రీస్తుశకం 1050 ప్రాంతంలో ఈ ఆలయాన్ని సందర్శించి మణిమాణిక్యాలను దానం చేసినట్లు శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని శాసనాలను ఇటీవల పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు పరిశీలించి వాటి చారిత్రక విలువను గుర్తించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా శనివారాల్లో విశేష పూజలు జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆధ్యాత్మికత, చరిత్ర, పురాణ గాథలు ఒకే చోట కలిసిన ఈ జామి క్షేత్రం ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటూ భక్తులను ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


