తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం, ప్రేమ వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్లో, ఈ తెలుగు నూతన సంవత్సరంలో.. అధర్మం, అహంకారాలకు ధర్మం చేతిలో పరాభవం జరిగి… శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని, ఆ పరా( శక్తి ),భవుడు(శివుడు) ల సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం జరగాలని.. అందరికీ నిపరాభవ నామ సంవత్సర” ఉగాది శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పరా అంటే శక్తి, భవుడు అంటే శివుడు అని అర్థం చెబుతూ, వారి కలయికతో లోకానికి మేలు జరగాలని ఆయన తన సందేశంలో వివరించారు. చిరంజీవి చేసిన ఈ విలక్షణమైన ట్వీట్కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.


