Last Updated:
కటారుపల్లి వేమన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పోలీసుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత, కార్యక్రమాలు నిలిపివేత
ప్రజాకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కటారుపల్లి వేమన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ముందుగా వేమన సమాధిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేస్తూ ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కటారుపల్లి ప్రాంతం మొత్తం భక్తిరసంతో కళకళలాడింది. ఈ ఏడాది తిరునాళ్లను ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి ఘనంగా నిర్వహించడం విశేషం.
భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత రంజు చేకూర్చాయి. దాదాపు 400 మంది డాన్సర్లతో నిర్వహించిన పాటల కచేరీలు, వివిధ దేవతా గేయాలు, సినీ పాటలకు కళాకారులు చేసిన నృత్యాలు యువతను ఉర్రూతలూగించాయి. తొమ్మిది వేదికలపై ఒకేసారి ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహించడం ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేక పూలతో అలంకరించిన వేమన శిలా విగ్రహం, వేమన విహారం భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మొక్కుబడులు ఉన్న భక్తులు ఎడ్ల పంటలను అలంకరించి గుడి ముందు ప్రదక్షిణలు చేయడం, చాందినీ బండ్లు ప్రదర్శించడం వంటి సంప్రదాయాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటారు.
అంతా సజావుగా సాగుతున్న వేళ ఒక్కసారిగా ఆపశృతి చోటుచేసుకుంది. తిరునాళ్లు చూసేందుకు కుటుంబంతో వచ్చిన వంశీ అనే యువకుడిపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై న్యాయం చేయాలని బాధితుడు సత్యసాయి జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీని కోరాడు. ఈ ఘటనతో ఉత్సవాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది భక్తులు పాల్గొన్న ఈ వేడుకలో ఒక్కసారిగా ఉద్వేగం పెరగడంతో, భారీగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో ఆనందోత్సవాల మధ్య కలకలం నెలకొని, భక్తుల్లో నిరాశ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Andhra Pradesh
Mar 31, 2026 10:03 PM IST


