Last Updated:
ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం నగరం కూడా సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పులపై చైతన్యం, విద్యుత్ వినియోగం తగ్గించడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని ఆయన తెలిపారు. 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF-India) ప్రారంభించిన ఈ కార్యక్రమం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాలు, ప్రాంతాల్లో కొనసాగుతున్న అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారింది. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి 20 సంవత్సరాలు పూర్తవడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
ఎర్త్ అవర్ ద్వారా ప్రజల్లో పర్యావరణంపై బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యమని, భవిష్యత్ తరాలకు భూమిని సంరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహాల్లోని ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.
నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs), యువత, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఒక్క గంట పాటు లైట్లు ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణపై గొప్ప సందేశాన్ని సమాజానికి అందించవచ్చని ఆయన తెలిపారు. భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, చిన్నచిన్న చర్యలతో పెద్ద మార్పులు సాధ్యమవుతాయని గుర్తుచేస్తూ, మార్చి 28న జరిగే ఎర్త్ అవర్లో విశాఖ నగర ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



