Last Updated:
మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో జోష్ యోగ టీం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళలు యోగా, డాన్స్లతో ఆనందంగా పాల్గొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో రంగులు జల్లుకుంటూ ఆనందంగా డాన్స్లు చేస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో కూడా మహిళా దినోత్సవ వేడుకలు ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో జోష్ యోగ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన అవసరం లేదని, జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళలు చురుకుగా పాల్గొనాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. ఆరోగ్యం, ఆనందం, ఐక్యత అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మహిళా శక్తి సమయమంతుల లక్ష్మి మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జోష్ యోగ ద్వారా ఉచిత యోగా కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. రోజూ ఉదయం కనీసం ఒక గంట సమయం ఆరోగ్యం కోసం కేటాయిస్తే మహిళల జీవన విధానం మరింత ఉల్లాసంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా డాన్స్లు చేశారు. మహిళలతో పాటు పురుషులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొనడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో గురువులు సమయమంతుల వెంకటస్వామి బాబ్జి మాట్లాడుతూ, ప్రస్తుతం చాలామంది మహిళలు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో యోగా వంటి వ్యాయామాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం ప్రతి ఒక్కరికీ అవసరమని సూచించారు.
అదేవిధంగా ప్రతి నెలలో ఒకసారి సభ్యులంతా కలిసి ఒక కుటుంబంలా పిక్నిక్ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇలా కలిసి సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి, జీవితంలో ఆనందం పెరుగుతుందని అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగులు జల్లుకుంటూ అన్లిమిటెడ్ డాన్స్ కార్యక్రమంతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోష్ యోగ సంస్థ నిర్వాహకులు సమయమంతుల వెంకటస్వామి బాబ్జి, లక్ష్మి దంపతులు, కామ ఈశ్వరరావు, రామలింగ జోగారావు, సుధాకర్, శేషు, నాగేశ్వరరావు, పెనుగొండ సుబ్రహ్మణ్యం, ఉమా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల ఐక్యత, ఆరోగ్యం, ఆనందానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


