Last Updated:
విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు.
పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు గుర్తించారు. అయితే అత్యాధునిక వైద్య సాంకేతికతతో చికిత్స అందించిన విశాఖపట్నం KIMS ICON Hospital వైద్యులు అతని ప్రాణాలను కాపాడగలిగారు.
ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డా. రవి కన్నా వివరాల ప్రకారం, ప్రమాదంలో రోగికి కడుపు భాగం, గ్రోయిన్, పెరినియం ప్రాంతాల్లో తీవ్రమైన రసాయన గాయాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా రెండు కళ్లలో కార్నియా మబ్బు ఏర్పడటంతో చూపు కూడా దెబ్బతింది. కుడి చేతిలో హ్యూమరస్ ఎముక విరిగిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇంతటితో ఆగకుండా, రోగి శ్వాసనాళం తీవ్రమైన వాపుతో మూసుకుపోవడంతో శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. బ్రోంకోస్కోపీ పరీక్షలో గ్రేడ్-3 ఇన్హలేషన్ గాయం ఉన్నట్లు నిర్ధారించారు. శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఈ నేపథ్యంలో వెంటనే వైద్యులు ఎక్మో చికిత్స (వీనో-వీనస్ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్)ను VF-VJ కాన్ఫిగరేషన్లో ప్రారంభించారు. ఈ అత్యాధునిక విధానం ద్వారా ఊపిరితిత్తులు పనిచేయలేని సమయంలో తాత్కాలికంగా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ప్రాణాలను నిలబెట్టారు. అదనంగా నెబ్యులైజ్డ్ హెపరిన్, స్టెరాయిడ్ చికిత్సలు అందిస్తూ శ్వాసనాళాలను శుభ్రపరిచే ప్రక్రియను కొనసాగించారు.
కాలిన గాయాల చికిత్స కూడా సమాంతరంగా కొనసాగింది. కడుపు దిగువ భాగం నుంచి తొడ, కాలువరకు తీవ్రంగా కాలిన గాయాలకు నిరంతరం డ్రెస్సింగ్లు చేశారు. శ్వాసనాళాల్లో పేరుకుపోయిన మలినాలను తొలగించేందుకు తరచూ బ్రోంకోస్కోపిక్ క్లీనింగ్ నిర్వహించారు. అదృష్టవశాత్తూ చర్మ మార్పిడి శస్త్రచికిత్స అవసరం రాకుండా వైద్యులు గాయాలను నియంత్రించగలిగారు.
చికిత్సకు రోగి శరీరం సానుకూలంగా స్పందించడంతో ఐదవ రోజుకే ఎక్మో నుంచి బయటకు తీసి, 15వ రోజున డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రోగి కంటి చూపు కూడా క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్లిష్ట చికిత్సను డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో పల్మనాలజిస్ట్ డా. ఫణీంద్ర, ప్లాస్టిక్ సర్జన్ డా. నితీష్ రెడ్డి, ఆఫ్తాల్మాలజిస్ట్ డా. సంధ్యలతో కూడిన బృందం సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఘటన ఆధునిక వైద్యసాంకేతికత ప్రాణాలను ఎలా కాపాడగలదో మరోసారి నిరూపించింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



