ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదని
రాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత వయసులోపు వివాహా లు చేసినట్లయితే చట్టప్రకారం సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. అదేవిధంగా వివాహానికి హాజరైన వారికి కూడా శిక్ష పడుతుందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నదని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100 కు ఫోన్ చేయాలన్నారు.
లబ్ధిదారులైన గర్భవతులకు బాలింతలకు బాల సంజీవని కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, లక్ష్మి, సావిత్రి ,భారతి, ముత్యాలమ్మ, హెల్పర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.


