ప్రాణాలతో ఆటలాడుతున్న రహదారి.. అంగర–కపిలేశ్వరం మార్గంపై ప్రజల ఆవేదన..! Kapileswaram Angara road potholes causing problems for people in East Godavari | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

తూర్పుగోదావరి జిల్లాలో కపిలేశ్వరం–అంగర రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు, విద్యార్థులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

+

తూర్పుగోదావరి..ఆరహదారిపై

తూర్పుగోదావరి..ఆరహదారిపై వెళ్ళామా ఇక అంతే సంగతులు

పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మాత్రం ప్రజలకు నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సౌకర్యంగా ఉండే ఈ మార్గం ఇప్పుడు గోతులతో నిండిపోయి, ప్రయాణం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే అన్న పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే ఈ రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరం మండలంలో అంగర నుంచి కపిలేశ్వరానికి వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉందని ప్రజలు చెబుతున్నారు. రహదారి అంతా పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి ఉండటంతో వాహనం ఒకసారి గోతిలో పడితే మళ్లీ సురక్షితంగా బయటపడుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. కపిలేశ్వరం కేంద్రంగా పనిచేసే వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ప్రతిరోజూ ఈ మార్గాన్నే ఉపయోగించాల్సి వస్తోంది. అయితే రహదారి పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో ప్రయాణం ప్రతి క్షణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల ఈ మార్గంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో ప్రాణనష్టాలు కూడా సంభవించాయని గ్రామస్థులు తెలిపారు. గాయాలతో ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితులు కూడా తరచూ ఎదురవుతున్నాయని వారు చెప్పారు. అత్యవసర సేవల కోసం వచ్చే 108 అంబులెన్స్ కూడా ఈ రహదారిపై ప్రయాణించడం కష్టసాధ్యమైపోతుందని, అంబులెన్స్ లోపల ఉన్న రోగి పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో గోతులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇదే వర్షాకాలం వస్తే రహదారి మొత్తం నీటితో నిండిపోయి చెరువులా మారిపోతుందని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు ఈ మార్గంలో ప్రయాణం చేయడం మరింత ప్రమాదకరంగా మారుతుందని వారు అంటున్నారు. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతుండగా, ఇలాంటి ప్రాథమిక సదుపాయాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కపిలేశ్వరం–అంగర రహదారిపై ఒకసారి అధికారులు స్వయంగా ప్రయాణిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి స్పష్టంగా తెలుస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా రహదారి మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలికంగా అయినా గోతులను పూడ్చి, అనంతరం పూర్తి స్థాయిలో కొత్త రహదారి నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్గాన్ని సరిచేస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *