విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వివిధ రకాల చట్టాలపై అవగాహనను విద్యార్థులను ఉద్దేశించి స్పష్టంగా వివరించడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని వారు తెలిపారు.అలాగే చదువుపై అధిక ఒత్తిడి తీసుకోకూడదని, ఏవిధమైన అవివేకపూరిత చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఆసక్తితో చదువుతూ మంచి భవిష్యత్తు కోసం లక్ష్యంపై దృష్టి పెట్టాలని వారు తెలిపారు. ఏదైనా అసౌకర్యకరమైన ఘటనలు జరిగితే వెంటనేతల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు పారిపోయే (ఎలోప్మెంట్) కేసుల వల్ల ఎదురయ్యే తీవ్రమైన సమస్యల గురించి కూడా వివరించడం జరిగిందన్నారు.
మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయానికి 100/112, బాల్య వివాహాల సమాచారానికి చైల్డ్ హెల్ప్లైన్ 1098, సైబర్ నేరాల కోసం 1930 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ఫోన్లను దుర్వినియోగం చేయకుండా, సైబర్ భద్రత పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ బాలికలకు ప్రత్యేకమైన చట్టం ఉందని, ఆ చట్టం ద్వారా అందరికీ మంచి భద్రత కలుగుతుందని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థినీలు అందరూ కూడా చక్కటి చదువును కొనసాగించాలని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందడుగు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.


