పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ – Visalaandhra



అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు

సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులు
ఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రి
మానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని పాప తండ్రి సురేశ్‌ కుమార్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులు
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేశ్‌ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-1 అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. ప్రజల నుంచి మొత్తం రూ.8.53 కోట్లకు పైగా విరాళాలు అందగా, ప్రభుత్వ సాయంతో కలిపి చికిత్సకు కావాల్సిన నిధులు సమకూరాయి.

ప్రస్తుతం పాప ఆసుప‌త్రిలో ఉందని, నాలుగైదు రోజుల్లో ఆమె ఆరోగ్యం, చికిత్స వివరాలపై పూర్తి అప్‌డేట్ ఇస్తానని సురేశ్‌ కుమార్ తెలిపారు. చికిత్సకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులు అందాయని, మిగిలిన డబ్బును తనలాగే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారుల వైద్యానికి అందిస్తానని ఆయన ప్రకటించడం అందరినీ కదిలించింది. వాస్తవానికి ఇంజెక్షన్ ఖర్చు కూడా అంచనా వేసిన దానికంటే తక్కువగా, సుమారు రూ.10 కోట్ల లోపే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక చిన్నారి ప్రాణం కోసం తెలుగు ప్రజలు చూపిన చొరవ, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *