ఎల్డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వరదలు, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ తనను తాను రక్షించుకుని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ అభివద్ధి, సంక్షేమాల అమలులో ఎక్కడా వెనుకాడ కుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చామన్నారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా పాలన సాగించామని, ఇప్ప్పుడు అదే విశ్వాసాన్ని ప్రజలు తమపై చూపిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ సంఘ్ పరివార్తో రాజీ పడుతోంది…
ఇదే క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్పై విజయన్ సునిశిత విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వైఖరులను అవలంబిస్తూ సంఘ్ పరివార్తో రాజీ పడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ మితవాద సిద్ధాంతాల వైపు మొగ్గు చూపుతోంది. పౌరసత్వ సవరణ చట్టం సహా పలు అంశాలపై మైనారిటీల హక్కులను పరిరక్షించేందుకు వామపక్షాలే రాజీలేని పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మితవాద రాజకీయాలకు వామపక్షాలే ప్రత్యామ్నాయం’ అని చెప్పారు. బీజేపీ గురించి మాట్లాడుతూ… ‘ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి బీజేపీతో ఎటువంటి రహస్య అవగాహన లేదని తేల్చి చెప్పారు. దానిపై వస్తున్నవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తాము చట్టపరంగా ఎదుర్కొంటామని, సమగ్ర శిక్షా అభియాన్సహా పలు పథకాల గురించి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,500 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందన్నారు. జాతీయ విద్యా విధానం పేరుతో కేరళలోని పాఠశాలల్లో ఆరఎసఎస్కు అనుకూలమైన సిలబస్ను బలవంతంగా రుద్దడాన్ని తాము అనుమతించబోం’ అని విజయన్ పేర్కొన్నారు.
The post పదవి కాదు… ప్రజలు ముఖ్యం appeared first on Visalaandhra.


