Last Updated:
గోదావరి జిల్లాల్లో పోలీసులు హెల్మెట్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. Rajolu, Anaparthi ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం సూచించిన రోడ్డు భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హెల్మెట్ ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, గ్రామస్థాయి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు పట్టణం మరియు రూరల్ ప్రాంతాల్లో సీఐ టి.వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. మొలకపల్లి, కడలి గ్రామాల నుంచి చింతలపల్లి మీదుగా రాజోలు వరకు సాగిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. “పక్క వీధికే కదా” అన్న నిర్లక్ష్య భావనతో హెల్మెట్ లేకుండా బయలుదేరితే క్షణాల్లోనే ప్రమాదం సంభవించవచ్చని పోలీసులు హెచ్చరించారు. గతంలో జరిగిన అనేక ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగిన ఉదాహరణలను వివరించారు.
ముఖ్యంగా సెల్ఫోన్తో మాట్లాడుకుంటూ వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో సీఐ వివరించారు. మాట్లాడే మాటలపై దృష్టి పెట్టి, రోడ్డుపై ఏకాగ్రత కోల్పోతే ఒక్క క్షణంలోనే ప్రమాదం సంభవిస్తుందని చెప్పారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో గుర్తుచేశారు. హెల్మెట్ ధరించండి, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు, మద్యం సేవించి వాహనం నడపవద్దు అనే మూడు కీలక సందేశాలను గ్రామ కూడళ్లలో, పంచాయతీ కేంద్రాల్లో ప్రజలకు తెలియజేశారు.
అదేవిధంగా Anaparthiలో ఎస్సై ఎల్. శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రమాణాల కార్యక్రమం నిర్వహించారు. అక్కడి వాహనదారులు, ఆటో డ్రైవర్లతో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకపోవడం, సిగ్నల్స్ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై స్పష్టమైన హామీలు తీసుకున్నారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, రక్షణాత్మక డ్రైవింగ్ పద్ధతులపై క్లుప్తంగా అవగాహన కల్పించారు.
విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత కీలకమని పోలీసులు సూచిస్తున్నారు. బిడ్డ బైక్ తీసుకుని బయటకు వెళ్తే హెల్మెట్ పెట్టించడమే కాకుండా, లైసెన్స్ ఉన్నదీ లేదో పరిశీలించాలని సూచించారు. చిన్న వయస్సులోనే నిర్లక్ష్య డ్రైవింగ్ అలవాటు ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణానికే కాదు, కుటుంబానికే పెద్ద దెబ్బ. అందుకే పోలీసుల ఈ ప్రత్యేక కార్యక్రమాలు కేవలం నియమాలు అమలు చేయడానికే కాకుండా, ప్రతి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంగా మారాయి. సురక్షిత ప్రయాణమే నిజమైన గమ్యం” అనే సందేశంతో గోదావరి జిల్లాల్లో సాగుతున్న ఈ చైతన్య కార్యక్రమాలు ప్రజల్లో ఎంత మేర ప్రభావం చూపుతాయో చూడాలి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


