- జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు
- కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం శుక్రవారం మైలవరం నియోజకవర్గంలోని వెల్వడం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ జి లక్ష్మీశ, స్ధానిక ఎమ్మేల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగాలను వర్చువల్గా తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు క్షేమం, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయన్నారు. విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ చేయిపట్టి నడిపిస్తున్నాయని, ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, డ్రిప్ లు ఇలా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. రైతులకు రుణభారం లేకుండా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీన మద్దతు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందని వివరించారు. అన్నదాత సుఖీభవ మూడో విడతలో 1,18,629 మంది లబ్ధిదారులకు రూ. 4 వేలు చొప్పున రూ. 47.45 కోట్లు లబ్ధి జరిగిందని.. అదేవిధంగా పీఎం కిసాన్ కింద 1,01,200 మంది లబ్ధిదారులకు రూ. 2 వేలు చొప్పున రూ. 20.24 కోట్లు జమ అయినట్లు కలెక్టర్ వివరించారు.
వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలుచేయడం జరుగుతోందని అన్నారు. నియోజకవర్గంలో ఈ విడత అన్నదాతలకు రూ.16.80 కోట్ల ఆర్థిక సహకారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరగుతోందన్నారు. ఈ సందర్భంగా 30,241 రైతు కుటుంబాలకు రూ. 16.80 కోట్ల ఆర్థిక సహాయానికి సంబంధించిన మెగా చెక్ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఏటీఎంఏ పీడీ మాధవీలత, వ్యవసాయ శాఖ అధికారులు ఎం.శ్రీనివాసరావు, స్థానిక నేతలు, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.



