*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు
(విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
లంకలో బాపనయ్య పరిస్థితి…
“నో గ్యాస్.. పరిస్థితి లంకలో బాపనయ్యలా తయారైంది” అంటూ నారాయణ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో కనీసం కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, చివరికి పండ్లు తిని కడుపు నింపుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం తన పరిస్థితి మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా సామాన్యులు గ్యాస్ ధరలు, కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు.
మోదీ అబద్ధాలాడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీపై నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఒకవైపు మోదీ అన్ని చోట్లా బ్రహ్మాండంగా వంట గ్యాస్ అందుబాటులో ఉందని చెప్తుంటే, ఇక్కడికి వచ్చేసరికి అసలు గ్యాస్ అనేదే లేకుండా పోయింది” అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మోదీ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన మండిపడ్డారు.
ట్రంప్ యుద్ధం.. భారత్ వైఫల్యం
అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం కూడా గ్యాస్ కొరతపై ఉందని నారాయణ విశ్లేషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఏర్పడిన యుద్ధ వాతావరణం ఈ సమస్యకు కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఇరాన్కు వెళ్లి బతిమాలుకుంటున్నారు తప్ప… యుద్ధానికి కారణమైన వారిని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు. యుద్ధం చేసే వాడిని ఆపకుండా, బాధితుడిని ఆపమని చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు.
అన్నీ ఉన్నాయి కానీ…
“అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి” అని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అన్నీ ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రజల ఇళ్లలో మాత్రం ఏమీ లేదని ఆయన చురకలు అంటించారు. దేశవ్యాప్తంగా సామాన్యులు ఇలాంటి అన్యాయమైన పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని నారాయణ అభిప్రాయపడ్డారు.


