టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు.
మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలు
అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా శివాజీ రాజాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.ప్రస్తుతం శివాజీ రాజా తన తండ్రి అంతిమ సంస్కారాల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.


