చైనాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని చెప్పారు. యుద్ధం విషయంలో నాటో వైపు నుంచి అమెరికాకు ఎటువంటి సాయం లభించలేదని స్పష్టం చేశారు.
చైనా.. ఇరాన్కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భుజం మీద పెట్టుకొని ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను తెహ్రరాన్కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. అమెరికా విమానాలు, డ్రోన్లను కూల్చడానికి ఇరాన్ వీటిని ఉపయోగిస్తోంది. వారం రోజుల్లో ఇవి తెహ్రాన్కు చేరే అవకాశం ఉందన్నాయి. తన పేరు బయటకురాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టం చేసింది.


