విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్టీఆర్ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.
తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది.
ప్రధాన కార్యకలాపాలు :
శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను పరీక్షించడం.
ప్రతి నెల 1,000 నుండి 1,500 నమూనాలపై పరీక్షలు నిర్వహించడం.
ఆలయం అవసరాల మేరకు దేశం లోనే ఏర్పాటు చేసిన ఈ తొలి అధునాతన ల్యాబ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో (కోర్ ల్యాబ్కు రూ.25 కోట్లు, ఈ-టంగ్/ఈ-నోస్కు రూ.3.5 కోట్లు, పవర్ సెటప్కు రూ.1.10 కోట్లు) నిర్మించిన ఈ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఈ ల్యాబ్లో 6,000 చదరపు అడుగులు రసాయనాల విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు మైక్రో బయాలాజికల్ విశ్లేషణకు కేటాయించారు.
అత్యాధునిక పరికరాలు :
జి సి/ జి సి – ఎంఎస్ : కొవ్వు ఆమ్లాలు, పురుగుమందులు, వాయువీయ పదార్థాల పరీక్షలు.
హెచ్ పి ఎల్ సి /ఎల్ సి- ఎంఎస్ : మైక్రోటాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్ల పరీక్షలు.
ఏ ఏ ఎస్ / ఐ సి పి – ఎమ్మెస్ : ఆహారం మరియు నీటిలో భారీ లోహాల గుర్తింపు.
ఇతర పరికరాలలో ఫైబర్/ప్రోటీన్/ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


