డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన.

+

రోడ్డు

రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు

అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli) పరిధిలోని రావికమతం, వి.మాడుగుల, రోలుగుంట మండలాలకు చెందిన గిరిజన గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో గిరిజనులు విశాఖలో డోలు మోతలతో, తలపై అడ్డాకులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.

ఈ ప్రాంతాల్లో జీవనం ఎంత కష్టసాధ్యమో వారి నిరసనే స్పష్టంగా తెలియజేసింది. అనారోగ్యం వచ్చినప్పుడు రోగులను డోలీపై కట్టుకుని కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర వైద్యం అందక ప్రాణాపాయం ఏర్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని సీపీఎం నాయకుడు కే.గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడం వల్ల గిరిజనుల జీవితం ఇంకా వెనుకబడిపోతుందని ఆయన అన్నారు.

జీలుగులోవ, నీళ్లు బంధ, సోంపురం, బందలు వంటి గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే కూడా కొండలు దిగి కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని గిరిజనులు తెలిపారు. ప్రాథమిక సదుపాయాల లేమితో వారు ఎదుర్కొంటున్న కష్టాలు మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయి.

గతంలో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను పలుమార్లు కోరినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల బంధ గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.2.11 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, ఏడాది గడిచినా నిధులు మంజూరు కాలేదని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇళ్ల స్థలాల సమస్య కూడా గిరిజనులను వేధిస్తోంది. కొండ దిగువ ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చినా, ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. కొందరు స్వయంగా ఇళ్లు నిర్మించుకున్నా ప్రభుత్వ సహాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఇళ్ల స్థలాలు, నిర్మాణ నిధులు మంజూరు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ మన్ పథకం ద్వారా గిరిజన గ్రామాలకు రోడ్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ ప్రాంతాల్లో మాత్రం ఆ హామీలు అమలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. గిరిజనుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం గిరిజనుల నిరసన ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. కనీస మౌలిక వసతులు లేక జీవనం సాగిస్తున్న ఈ గిరిజన గ్రామాలకు రోడ్డు, ఇళ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం అత్యవసరమని ప్రజలు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *