డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి


సీఎం చంద్రబాబు
ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన రెండో దశ నియంత్రణ సడలింపు విధానాలపై విస్తృతంగా చర్చించారు.పరిశ్రమల స్థాపనలో వేగం పెంచడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను కార్యదర్శి ముఖ్యమంత్రి ఎదుట వివరించారు.అనంతరం ఈ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది వందలకుపైగా నిబంధనలను వందలోపునకు పరిమితం చేయాలని సీఎం సూచించారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. వేధింపులకు తావు లేకుండా మూడవ పక్ష తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
అటవీ చట్టాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందానికి సూచించారు.
అగ్ని భద్రతకు సంబంధించి జాతీయ భవన నియమావళి స్థానంలో రాష్ట్ర నిబంధనలను అనుసరించే విషయంలో పలు సూచనలు చేశారు.రెండుసార్లు అనుమతులు తీసుకునే విధానాన్ని నివారించాలని, ఒకసారి నమోదు చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా నిబంధనలను సవరించాలని సూచించారు.

రాబోయే మే నెలాఖరులోగా రెండో దశ నియంత్రణ సడలింపు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. దరఖాస్తు నుంచి అనుమతి వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమలకు అనుమతులు, నిబంధనల విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందని కార్యదర్శి పేర్కొనగా, వ్యాపార సౌలభ్యాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజలకు సేవల అందింపులో కూడా వేగాన్ని పెంచే విధానాన్ని అనుసరిస్తున్నామని వెల్లడించారు. మూడో దశ నియంత్రణ సడలింపుపై ప్రణాళికల గురించి సీఎం ప్రశ్నించగా, జూన్‌ నుంచి ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ దశలో సాంకేతిక అనుసంధానం, ఆధునిక సాధనాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *