మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలోని అమరావతిపై కూటమినేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి వైయస్సార్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకము కాదు అని, టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరము వైయస్సార్ పార్టీ పోరాటం చేసి తీరుతుందని వారు సవాల్ విసిరారు. చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధాని అమరావతి వేదిక అయిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకేమో మంచి ప్లాట్లు చూపిస్తారని, అదే వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు మాత్రం కంప్యూటర్లో తప్ప చూపించుకున్న మోసం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుని ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించే విధంగా చర్యలు చేపట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు. పదేళ్ల క్రితం రాజధాని రైతుల నుండి ల్యాండ్ పోలింగ్ ద్వారా 33 వేల ఎకరాల కు పైగా భూసేకరణ చెరిపి ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలు చేయకుండా తాత్కాలిక నిర్మాణాలతో కేంద్ర ప్రభుత్వ నిధులను దొడ్డిదారి పట్టించారని మండిపడ్డారు. తనకు అనుకూలమైన కాంట్రాక్టర్ల కంపెనీలకు దోచిపెట్టడం నిజము కాదా అని వారు మరోసారి ప్రశ్నించారు. అంతేకాకుండా 20 వేల ఎకరాల భూ సేకరణకు సిద్ధమవడం చూస్తే చంద్రబాబు ధన దాహం తప్ప అభివృద్ధి బాట ఏది కనబడటం లేదని వారు స్పష్టం చేశారు. సాధారణంగా రింగ్ రోడ్డు కిలోమీటర్ కు 22 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తారని, అదే రాజధాని లో మాత్రం రింగురోడ్డు కిలోమీటర్ కి 175 కోట్లతో నిర్మించడం ద్వారా ఎంత అవినీతి జరుగుతోందో ప్రజలకు తెలుస్తోందని తెలిపారు. చంద్రబాబు పాలనను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, వచ్చే 2029 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీకు పట్టం కడతారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించడం జరిగిందని, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచిన తూతూ మంత్రంగా అభివృద్ధి చేస్తూనే తప్ప శాశ్వతంగా చేయడం లేదని వారు తెలిపారు. ప్రజల సమస్యలపైనే వైయస్సార్సీపి పార్టీ పోరాటం చేస్తుందని, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.


