విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా నాలాలో ఉన్న పూడిక, జమ్ముచెట్లను పరిశీలించారు. వీటి తొలగింపుకు ఎంత మేర నిధులు అవసరం, ఎలా చేయాలన్నది? ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు, రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులంతా సమిష్టిగా పాల్గొనాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ నాలా కింద 206 ఎకరాల ఆయకట్టు ఉండగా..1000 మీటర్ల వద్ద తిప్పేపల్లి చెరువు మరువ నీరు కలుస్తుందన్నారు. దీని ద్వారా సంగాల చెరువుకు నీరందించే అవకాశం ఉందన్నారు. సంగాల చెరువు కింద 96.50 ఎకరముల ఆయకట్టు ఉందన్నారు. జమ్ము, కంప చెట్లు, పూడికతో నిండి పోవటం వలన నాలా ద్వారా నీరు సంగాల వరకు పూర్తి స్థాయిలో వెల్లటం లేదన్నారు. జలధార కార్యక్రమం ద్వారా ఈకాలువలో జమ్ము, కంపచెట్లు మరియు పూడిక
ను తొలగించవచ్చన్నారు. ఇందుకోసం ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటే వచ్చే వర్షాకాలంలో చెరువుకు కచ్చితంగా నీరు అందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి.. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వీటి ద్వారా అనేక ప్రాంతాలకు నీరు అందుతుందన్నారు. చిన్న చిన్న పనుల ద్వారా నీటి ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చేస్తే.. సగం వరకు నీటి సమస్య తీరే అవకాశం ఉందన్నారు. అయితే ఇందులో సాగునీటి సంఘాలతో పాటు రైతులు, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.


