చేనేత కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు, కార్మికులు నిర్వహించిన ర్యాలీలో తాము కూడా పాల్గొని తమవంతుగా చేనేతకు మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా చేనేత ఐక్యతను తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. మొత్తం 18 భాగస్వామి సంఘాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. చేనేతల డిమాండ్ సాధనకై ఈ మహా ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50 లక్షల 65 వేల కోట్లతో చేనేత రంగానికి 25 వేల కోట్లు కేటాయించాలని, సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన 23 కోట్లు బకాయిలను వెంటనే చెల్లించాలని, చేనేతలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలుపరచాలని, సహకార సంఘాలకు ఉన్న రుణాలను రద్దు చేయాలని, రైతులకు ఇచ్చిన విధంగా చేనేతలకు కూడా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని, ఆకలి చావులతో ఆత్మహత్యలతో మృతి చెందిన చేనేత కార్మిక కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్దించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గం తో పాటు శ్రీ సత్య సాయి జిల్లా చేనేత కార్మిక సంఘం నాయకులు చేనేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


