విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 150 కోట్లు భారం పడుతుందన్నారు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ, 8,640 మరమగ్గాలు వారికి ఏడాదికి రూ, 21,600 విద్యుత్ భారం తగ్గునున్నదని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్నచిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం కలిగే అవకాశం ఉందని, పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు పలువురు చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.


