విశాలాంధ్ర–రొళ్ళ: మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ హోటల్ సమీపంలో నెలలుగా ఎండిపోయి ప్రమాదకరంగా నిలిచిన జువ్వి చెట్టు గురువారం ఒక మహిళకు తీవ్ర గాయాలకు కారణమైంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బస్టాండ్ వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎండిన కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.స్థానికుల ప్రకారం, ఆ జువ్వి చెట్టు పూర్తిగా ఎండిపోయి చాలా కాలంగా ప్రమాద సూచనలతో నిలిచినా, సంబంధిత అధికారులు తొలగించే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. రోజూ రద్దీగా ఉండే ఈ రహదారిలో ఇటువంటి ప్రమాదకర చెట్లు ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.


