Last Updated:
శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఆలయాలు ద్వారాలు మూసివేసి పూజా కార్యక్రమాలు నిలిపివేస్తాయి. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచి విశేష పూజలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. అందువల్ల గ్రహణ సమయంలో కూడా భక్తులకు దర్శనం కలిగే అరుదైన క్షేత్రంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి చెందింది.
ఈ క్షేత్రంలో స్వయంభూ లింగరూపంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడని పురాణాల్లో పేర్కొంటారు. ముఖ్యంగా రాహు–కేతు దోష నివారణకు ఈ ఆలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. గ్రహణ సమయంలో రాహు–కేతు పూజలు, సర్పదోష నివారణ పూజలు, ప్రత్యేక గ్రహణ కాలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే పూజలు అత్యంత ఫలప్రదమని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీజ్ఞానప్రసునాంబిక సమేతంగా స్వామివారికి జరిగే అభిషేకాలను దర్శించడం ద్వారా గ్రహణ దోషాలు మాత్రమే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందువల్ల దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు గ్రహణ సమయాల్లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తికి చేరుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టత ఏమిటంటే రాహు–కేతువులు శివునిలో ఐక్యమై ఉన్నారని విశ్వాసం. అందువల్ల గ్రహణ దోషాలు ఇక్కడ వర్తించవని పండితులు చెబుతారు. గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి ఐశ్వర్యం, శాంతి, సౌఖ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
గ్రహణం అంటే ఆలయాలు మూసివేత అనే సాధారణ భావన ఉన్నప్పటికీ, శ్రీకాళహస్తి వంటి మహాక్షేత్రంలో మాత్రం గ్రహణ సమయమే భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అవకాశంగా మారుతుంది. ఈ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించుకుంటే గ్రహణ దోషాలు తొలగి శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం బలంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh
Mar 01, 2026 10:04 PM IST



