అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖామేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖామేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఇరాన్ ఈ మేరకు ధ్రువీకరించింది. ఇజ్రాయెల్, అమెరికా పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భారీ దాడులు జరిపినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిందని ఇరాన్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆయన మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్, నెతన్యాహు చూశారని వెల్లడించింది. దాడుల్లో ఖమేనీ కుటుంబంలోని పలువురు మృతి చెందారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఖమేనీ కోడలు కూడా మరణించినట్లు తెలుస్తోంది.


