Last Updated:
శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ధ్వజారోహణ కార్యక్రమం హిందూ దేవాలయాల్లో అత్యంత ముఖ్యమైన సంప్రదాయంగా భావించబడుతుంది. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం పై దేవుని చిహ్నం ఉన్న పతాకాన్ని ఎగురవేయడాన్నే ధ్వజారోహణం అంటారు. ‘ధ్వజ’ అంటే జెండా, ‘ఆరోహణం’ అంటే ఎగురవేయడం అనే అర్థాలు కలిగి ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ దేవతలకు, అష్టదిక్పాలకులకు, ముక్కోటి దేవతలకు ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆహ్వానం పలికినట్లుగా భావిస్తారు.
సాధారణంగా తెల్లటి వస్త్రంపై ఆలయ దైవానికి సంబంధించిన వాహనం లేదా చిహ్నాన్ని చిత్రించి పతాకాన్ని సిద్ధం చేస్తారు. విష్ణు ఆలయాల్లో గరుత్మంతుడి చిహ్నం, శివాలయాల్లో నంది చిహ్నం ఉండేలా పతాకాన్ని తయారు చేస్తారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ధ్వజస్తంభానికి దర్భ గడ్డిని చుట్టడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది విద్యుత్ తరంగాలను స్వీకరించే యాంటెన్నాలా పనిచేస్తుందనే నమ్మకం ఉంది.
ధ్వజారోహణం ద్వారా దేవతలను ఉత్సవానికి ఆహ్వానించడం, గ్రామ భక్తులందరినీ ఉత్సవాల్లో భాగస్వాములను చేయడం మరియు ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని ప్రార్థించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ధ్వజారోహణం జరిగిన తరువాతే బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఉత్సవాలు ముగిసే రోజున ధ్వజావరోహణం నిర్వహించి దేవతలకు వీడ్కోలు పలికినట్లు భావిస్తారు.
శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి సేవలో పాల్గొన్నారు. కృతయుగం నుంచే భక్తుల పాలిట కొంగుబంగారంగా, ఆశ్రిత కల్పవృక్షంగా పేరుగాంచిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
వైఖానసాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించే ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో గరుత్మంతుడు ధ్వజారూఢుడై ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, మహర్షులు, పితృదేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్న సంకేతంగా భావిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో భక్తులకు అఖండ పుణ్యఫలం లభించాలని అర్చకులు ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh


