కడలి కపోతేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతలు కాశీ అనుసంధానం విశ్వాసం. Kadali Kapotheswara Swami sheds light on Kashi Mukti belief | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కడలి కపోతేశ్వర స్వామి క్షేత్రం కాశీతో అనుసంధానమైన జల విశ్వాసం, ప్రత్యేక సంప్రదాయాలతో భక్తులను ఆకర్షిస్తూ “కడలి కాశీ”గా ప్రసిద్ధి చెందింది.

+

అక్కడ

అక్కడ కోనేరులో బిల్వంవేస్తే కాశీలో తేలుతుంది.. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన చరిత్

గోదావరి తీర ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలోని కపోతేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి నడుమ వెలసిన ఈ ప్రాచీన శివక్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి పవిత్ర కోనేరుతో కాశీ మహాక్షేత్రానికి అంతర్వాహినిగా జల మార్గం ఉందనే విశ్వాసం. ఆలయానికి వచ్చే భక్తులు కోనేరులో బిల్వదళం సమర్పిస్తే అది అంతర్జలవాహిని గుండా నేరుగా కాశీకి చేరుతుందని స్థానిక అర్చకులు చెబుతున్నారు. ఈ విశ్వాసంతోనే సంవత్సరాంతం భక్తులు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ముఖ్యంగా ఆదివారం పర్వదినం, మాఘమాసం చివరి రోజులు, మహాశివరాత్రి వంటి శుభసందర్భాల్లో ఈ క్షేత్రంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. శివాలయంలో మహాదేవుడిని దర్శించుకుని, ఎదురుగా ఉన్న సూర్యదేవుడికి నమస్కరించిన అనంతరం కోనేరుకు చేరుకుని బిల్వం సమర్పించడం ఇక్కడి ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తులు బిల్వదళాన్ని నీటిలో వేస్తుండగానే అది క్షణాల్లోనే అడుగుభాగానికి చేరిపోతుందని, అదే కాశీకి వెళ్లే జల మార్గమని అర్చకులు వివరిస్తున్నారు.

కాశీ యాత్ర చేయడం ఒకప్పుడు జీవితంలో చివరి యాత్రగా భావించేవారని, అందరికీ ఆ అవకాశం ఉండేది కాదని పెద్దలు చెప్పుకొస్తున్నారు. అలాంటి వారికి కాశీ ముక్తి ప్రసాదించే క్షేత్రంగా కడలి కపోతేశ్వర స్వామి ఆలయం పేరుపొందింది. కాశీకి వెళ్లలేని భక్తులు ఇక్కడ కోనేరులో బిల్వం సమర్పిస్తే అదే ఫలితం లభిస్తుందని గాఢ విశ్వాసం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు “కడలి కాశీ” అని కూడా భక్తి భావంతో సంభోదిస్తారు.

కోనేరులోని జలాలను కాశీ జలాలతో అనుసంధానమైన పవిత్ర తీర్థంగా భావిస్తారు. భక్తులు ముందుగా ఆ నీటిని తలపై జల్లుకుని, శివనామస్మరణతో బిల్వదళం సమర్పిస్తారు. “హర హర మహాదేవ” నినాదాల మధ్య జరిగే ఈ ఆచారం దర్శనార్థులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తుతుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం స్థానిక సంస్కృతి, శైవ భక్తి పరంపరకు నిదర్శనంగా నిలుస్తోంది.

మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ కడలి క్షేత్రంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం పర్వదినంతో కలిసొచ్చే శివరాత్రి రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశముందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలు, రాత్రి జాగరణలు, బిల్వార్చనలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు.

ఆధ్యాత్మిక చరిత్ర, విశిష్ట సంప్రదాయం, కాశీతో అనుసంధానమైన జల విశ్వాసం.. ఈ మూడు ప్రత్యేకతలతో కడలి కపోతేశ్వర స్వామి క్షేత్రం భక్తి మార్గంలో ఒక అరుదైన నిలయంగా నిలుస్తోంది. విశ్వాసమే ప్రధాన బలం అన్నట్టు, కోనేరులో ఒక బిల్వం సమర్పిస్తూ కాశీ ముక్తి కోరే భక్తుల నమ్మకం ఈ దివ్యక్షేత్ర మహిమను మరింత విస్తరింపజేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *