గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి దిగ్గజ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి.ప్రధాన సూచీలు బలహీనపడినప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు మాత్రం కొంత నిలకడగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.25 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 0.20 శాతం చొప్పున స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం. రంగాల వారీగా చూస్తే, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ను కిందికి లాగాయి. మరోవైపు, మెటల్ స్టాక్స్ కొంత మద్దతునిచ్చి టాప్ గెయినర్గా నిలిచింది.అమెరికా పట్ల తీవ్ర అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘలీబాఫ్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో ఆందోళన పెంచాయి. కాల్పుల విరమణ ఒప్పందాలను అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలతో ఐదు రోజులుగా కొనసాగుతున్న రూపాయి ర్యాలీకి కూడా బ్రేక్ పడింది. టెక్నికల్ పరంగా నిఫ్టీ 23,600 స్థాయికి దిగువకు పడిపోతే మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


