ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ


. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం
. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన
. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాలతో తలెత్తిన పంటనష్టంపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణ కోసం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ… 60 వేల మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిని 100 శాతం వినియోగించుకునేలా చూడటంతో పాటు జిల్లాకు కనీసం 10 వేలకు తగ్గకుండా నూతన కనెక్షన్లు ఇవ్వాలంటూ సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం- కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని చెప్పారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార’ విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని, ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించేలా చూడాలన్నారు. విద్యా సంస్థలకు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యతా క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. మరోవైపు గత ఐదు రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన పంట నష్టం ప్రాథమిక వివరాలపైనా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ కల్లా పంట నష్టం అంచనా వేసి… నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయంలో జీఎస్డీపీ 40 శాతం, ఉత్పాదన 71 శాతం పెరగడంతో పంటల నిర్వహణ, పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలన్నారు.
ఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలు
టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, దీనికి తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యనే నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ, నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని, దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. ఇప్ప్పుడు కొండపై ప్రసాదం బావుంది, దర్శనం బావుంది, శ్రీవారి సేవకులు, భక్తుల్లో సంతృప్తి పెరిగిందని అన్నారు. అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా తిరుమల ప్రసాదాల్లో పౌష్టికాహార విలువలు, పదార్ధాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని, దీంతో భవిష్యత్‌లో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం అన్నారు. ఇదే తరహాలో మిగిలిన శాఖలు మెరుగైన ప్రజా సేవలకు ఏఐ ఇంటిగ్రేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఐఓటీ పరిక రాలు, సెన్సార్లు, సీసీ టీవీ లాంటి వివరాలతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి, ఉత్పత్తి పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగంపైనా అధ్యయనం జరపాలన్నారు. రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ పెంచేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ శాఖలు అవేర్, డేటా వినియోగం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడటం కీలకమన్నారు. సమావేశానికి మంత్రులు కొలుసు పార్థసారధి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

The post ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *