Last Updated:
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఎన్నికలు లేక సర్పంచులు చైర్మన్లకు వీడ్కోలు, ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం, ప్రజల దృష్టి వారి పనితీరుపైనే
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల రాజకీయాల్లో ఒక కీలక మార్పు దశ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉన్న ప్రజా ప్రతినిధులు పదవులకు వీడ్కోలు చెబుతున్నారు. ఒకవైపు సత్కారాలు, అభినందనలు.. మరోవైపు బాధాకరమైన వీడ్కోలు దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది.
గత ఐదేళ్లుగా ప్రజల ఓట్లతో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తమ బాధ్యతలను నిర్వహించారు. అయితే వారి పదవీకాలం పూర్తవడంతో ఇప్పుడు అధికార వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు వెంటనే జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమై కొన్ని రోజులు గడిచాయి. తాజాగా పంచాయతీల్లో కూడా ఇదే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో సర్పంచులకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ, కొత్తగా బాధ్యతలు చేపడుతున్న ప్రత్యేక అధికారులకు స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ రూరల్, కోనసీమ జిల్లా రాజోలు వంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం ప్రజల దృష్టి అంతా ప్రత్యేక అధికారుల పనితీరుపైనే ఉంది. ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉండటంతో, వీటిని పరిష్కరించడంలో అధికారులు ఎంతవరకు ముందుకు వస్తారో అన్న ఆసక్తి నెలకొంది. “ఇప్పటివరకు జరగని పనులు ఇప్పుడు జరుగుతాయా? అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.
పంచాయతీల్లో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తుండగా, మున్సిపాలిటీల్లో జిల్లా స్థాయి అధికారులను బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో పరిపాలన మరింత కట్టుదిట్టంగా, సమర్థంగా కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే గతంలో అమలు చేసిన “డయల్ యువర్ మున్సిపాలిటీ” వంటి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విధానం ద్వారా ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు మరింత చేరువైన పాలనగా మారే అవకాశముంది. మొత్తంగా చూస్తే, ఎన్నికల లేమితో ఏర్పడిన ఈ తాత్కాలిక పరిస్థితి పరిపాలనలో కొత్త మార్పులకు దారితీస్తోంది. ప్రత్యేక అధికారుల పనితీరే ఇప్పుడు కీలకం కానుంది. ప్రజల అంచనాలను నెరవేర్చగలిగితే ఈ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.. లేకపోతే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Apr 07, 2026 11:04 PM IST


