ఉగాది అంటే కేవలం పండుగ కాదు.. ప్రకృతి పునర్జన్మ, రైతుల కొత్త ఆశల ఆరంభం! Ugadi Festival New Hopes and Beginnings Pulakanda Subrahmanya Sharma. |


Last Updated:

ఉగాది పండుగ తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది. ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు సుఖదుఃఖాలను సూచిస్తాయి.

+

ఉగాది

ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే

తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని విజయనగరం జిల్లా సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సరానికి ఆరంభం అవుతుందని, ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన చెప్పారు. ఉగాది పండుగ కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ప్రకృతిలో కొత్త జీవం మొదలయ్యే కాలానికి సంకేతమని ఆయన వివరించారు.

వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఉగాది సమయంలో ప్రకృతి కొత్త రంగులు దాల్చుతుంది. పాత ఆకులు రాలిపోయి చెట్లు కొత్తగా చిగురించే సమయం ఇదే. ప్రకృతి అంతా కొత్త అందాలతో కళకళలాడే ఈ కాలం మనుషుల జీవితాల్లో కూడా కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అందుకే ఉగాదిని కొత్త జీవితానికి ప్రతీకగా భావిస్తారని చెప్పారు.

ఉగాది సందర్భంగా తయారు చేసే ఉగాది పచ్చడికి కూడా ప్రత్యేకమైన అర్థం ఉందని సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. ఈ కాలంలో ప్రకృతిలో లభించే చింతపండు, మామిడి కాయలు, చెరుకు గడలు, మిరపకాయలు, మిరియాలు వంటి పదార్థాలతో పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలను సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, ఆశ వంటి అనేక అనుభూతులు జీవితంలో ఉంటాయని, వాటిని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి అందిస్తుందని చెప్పారు.

రైతు కుటుంబాలకు ఉగాది పండుగ మరింత ప్రత్యేకమైన ఆనందాన్ని తీసుకువస్తుందని ఆయన తెలిపారు. రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయానికి శ్రీకారం చుట్టే రోజు కూడా ఉగాదే అని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు “ఏరువాక” అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారని వివరించారు. తమ పంటలు సమృద్ధిగా పండాలని, భూమాత కరుణతో మంచి దిగుబడి రావాలని కోరుకుంటూ రైతులు ఉగాది రోజున పొలంలో కొత్తగా ఏరువాకును ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఉగాది రోజున శుభముహూర్తంలో రైతులు తమ పొలాలకు వెళ్లి భూమిని తల్లిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు. కొందరు రైతులు బంగారపు వస్తువుతో భూమిని తాకిస్తూ ఏరు దున్నడం ద్వారా కొత్త వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు. భూమాత ఆశీస్సులతో తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తారని వివరించారు.

ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులందరూ కలిసి పొలానికి వెళ్లి అక్కడే చద్దన్నం తింటూ ఆనందోత్సవాలు జరుపుకుంటారని ఆయన తెలిపారు. ఇల్లు ఉన్నా కూడా భూమే అసలు ఆస్తి అని భావించే రైతులు భూమిని ఎంతో గౌరవంతో పూజిస్తారని చెప్పారు. వ్యవసాయానికి తొలి అడుగు అయిన ఏరుపూత కార్యక్రమాన్ని ఉగాది రోజున నిర్వహించడం చాలా కాలంగా కొనసాగుతున్న రైతుల సంప్రదాయమని వివరించారు.

ఉగాది కాలం ప్రకృతి పునర్జన్మను సూచించే సమయమని సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. చెట్లు కొత్తగా చిగురించినట్లే మనుషుల జీవితాలు కూడా కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగాలని ఈ పండుగ సందేశమని చెప్పారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగ ముఖ్యంగా రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని ఆయన తెలిపారు.

పంటల కోత పూర్తై రైతులు కొంత విశ్రాంతి పొందే సమయంలో ఉగాది పండుగ రావడం వల్ల వారి ఆనందం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉగాదిని ఆనందంగా జరుపుకోవడం ద్వారా ఐక్యత, ఆనందం, సంపదలు పెరుగుతాయని సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *