ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్


ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని, ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా నిర్వీర్యం చేశామని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే సంకేతాలను ఈ ప్రకటన ఇచ్చింది.తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థను, వైమానిక, నౌకా దళాలను నామరూపాలు లేకుండా చేశామని తెలిపారు. ఉగ్రవాద ముప్పుగా మారిన ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని, దీనివల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు అమెరికా అండగా నిలిచిందని గుర్తుచేశారు.

ఇదే సమయంలో, ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి భద్రత విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై ఆ జలసంధి భద్రత అమెరికా బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఆ మార్గాన్ని అమెరికా ఉపయోగించదు. కాబట్టి దాని ద్వారా లబ్ధి పొందుతున్న దేశాలే తమ భద్రతను చూసుకోవాలి అని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే సహాయం అందిస్తామని, కానీ ఇరాన్ ముప్పు తొలగిపోయినందున అది సాధారణ సైనిక చర్యగానే ఉంటుందని వివరించారు.

ట్రంప్ వ్యాఖ్యలు పశ్చిమాసియా నుంచి అమెరికా తన సైనిక బలగాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాలిస్తున్నాయి. భద్రతా భారాన్ని మిత్రదేశాలకు బదిలీ చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, అణ్వాయుధాల తయారీ దిశగా ఇరాన్ ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *