Last Updated:
ఆంధ్రప్రదేశ్లోని 11 నగరాల్లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ శుభవార్త అందించింది. ఇకపై అత్యవసరంగా పత్రాలు, పార్సిళ్లు పంపాల్సి వచ్చినా సమయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. తొలిసారిగా రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాల్లో 24 గంటల తపాలా సేవలను ప్రారంభిస్తూ పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానంతో ప్రజలకు రాత్రింబవళ్లు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుంతకల్లు నగరాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ 24 గంటల సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా విశాఖపట్నంలోని వన్టౌన్ ప్రాంతంలో ఉన్న వెలంపేట ప్రధాన తపాలా కార్యాలయం ఇప్పుడు నగర ప్రజలకు నిత్యం తెరవబడి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను ఎప్పుడైనా వినియోగించుకోవచ్చని విశాఖపట్నం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఎన్వీఎస్ఎన్ రాజు తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధార్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. 24 గంటల సేవల అమలులో భాగంగా మూడు షిఫ్టులుగా సిబ్బంది పనిచేస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు మొదటి షిఫ్ట్, సాయంత్రం 4 నుంచి రాత్రి 12 వరకు రెండో షిఫ్ట్, రాత్రి 12 నుంచి ఉదయం 8 వరకు మూడో షిఫ్ట్ విధులు నిర్వహిస్తుంది. సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో స్పీడ్ పోస్ట్, పార్సిల్ సేవలు నిరంతరం కొనసాగుతాయి.
వెలంపేట తపాలా కార్యాలయాన్ని ఆధునీకరించి ప్రజలకు మరింత సౌకర్యంగా మార్చామని డిప్యూటీ సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్ తెలిపారు. పార్సిల్ పంపాలనుకునే వారికి కార్యాలయంలోనే ప్యాకేజింగ్ సామగ్రి అందుబాటులో ఉంచామని, అవసరమైతే సిబ్బందే ప్యాకింగ్ చేసి పంపించే సదుపాయం కల్పించామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
24 గంటల తపాలా సేవలు ప్రారంభం కావడంతో విశాఖ నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రివేళల్లో కూడా సేవలు అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమని అంటున్నారు. కాలానికి అనుగుణంగా తపాలా శాఖ సేవలు విస్తరిస్తుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ సేవలకు కొత్త దిశను చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



