టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్
గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని రన్వేపై నిలిపివేశారు. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఇండిగో అధికారులు ప్రకటించారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు రోడ్డు మార్గాన బయల్దేరారు. మిగిలిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తామని ఇండిగో అధికారులు హామీ ఇచ్చారు. దాదాపు రెండు గంటల తర్వాత మరో విమాన సర్వీసులో ఆ ప్రయాణికులను హైదరాబాద్ పంపే ఏర్పాట్లు చేశారు.


