విశాలాంధ్ర-రాప్తాడు : జిల్లాలో దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో, అనంతపురంలోని వారి నివాసంలో అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత ఐదున్నర దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ ఆలస్యం కావడంతో సేవా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళన నెలకొందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఈ సందర్భంగా అన్నే ఫెర్రర్ ఉద్వేగానికి గురవుతూ, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులని, ఫాదర్ ఫెర్రర్ ఆశయ సాధనలో సేవలు నిరంతరం కొనసాగుతాయని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ దంపతులు ఫెర్రర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఆర్డీటీ సేవలు భవిష్యత్తులో మరింత విస్తృతం కావాలని వారు ఆకాంక్షించారు.


