ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు.

+

ఆంజనేయుడుపూజలు

ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి

గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే ఈ ఆలయం, శతాబ్దాల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్నా, ఇప్పటికీ సరైన అభివృద్ధి లేక భక్తులకు సౌకర్యాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలోని రామగిరి కొండపై ఈ దివ్యక్షేత్రం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సీతారాములు స్వయంభువుగా వెలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, భద్రాచలంలోలాగే ఒకే శిలపై సీతారాములు దర్శనం ఇస్తుండటం. ఈ దృశ్యం చూసిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోతారు.

ఇంకా ఈ క్షేత్రానికి మరో విశేషం కూడా ఉంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి సీతారాములను ఆరాధించేవారని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇందుకు గుర్తుగా కొండపై ఆయన పాదముద్రలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పాదముద్రలు భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంచుతున్నాయి. అంతేకాకుండా, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కూడా ఈ రాములను దర్శించి, బ్రిటిష్‌పై పోరాటానికి బయలుదేరేవారని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రస్తుతం సరైన సదుపాయాలు లేకపోవడం బాధాకరం. ముఖ్యంగా కొండపైకి వెళ్లేందుకు సరైన మెట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులే చందాలు సేకరించి కొంతవరకు మెట్లు నిర్మించారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో మార్గం లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు కొండపైకి చేరుకోవడం కష్టంగా మారింది.

ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో సీతారాములకు నిత్య పూజలు జరగడం లేదు. అయితే గ్రామస్తులు, రామభక్తులు మాత్రం ప్రతి సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ఉత్సవాలు నిర్వహించనుండగా, 28వ తేదీన శ్రీరామ కళ్యాణం వైభవంగా జరగనుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఒక విశ్వాసాన్ని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడి సీతారాములను దర్శించి కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుందని అంటున్నారు. ఈ విశ్వాసంతోనే దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇంతటి మహిమగల ఆలయం అభివృద్ధి చెందకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న రామగిరి కొండపై ఆలయాన్ని అభివృద్ధి చేస్తే, ఇది భవిష్యత్తులో ప్రముఖ తీర్థక్షేత్రంగా మారే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న ఈ పవిత్ర స్థలం, భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *