Last Updated:
వైఎస్ కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశం. వైఎస్ షర్మిల, జగన్పై తీవ్ర విమర్శలు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల వ్యాఖ్యలు సంచలనం. జగన్పై ఆరోపణలు, వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు సహా గిరిజన ప్రాంతాలను సందర్శించిన షర్మిల, అనంతరం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్పై నేరుగా తీవ్ర విమర్శలు గుప్పించారు. “అన్న అనే పదానికి జగన్ కళంకం తెచ్చారు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. “అలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి.
జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికైనా ఇబ్బందులు కలిగించగలరని షర్మిల ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, దానిని పూర్తిగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని విమర్శించారు. సునీతతో పాటు తానే పలుమార్లు ఈ విషయంపై మాట్లాడినా న్యాయం జరగలేదని, తమకు అన్యాయం జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్ కుటుంబంలో ఈ విభేదాలు కొత్తవి కావు. గతంలో కూడా కొన్నిసార్లు షర్మిల తన అన్నపై విమర్శలు చేసినప్పటికీ, ఈసారి మాత్రం ఆమె వ్యాఖ్యలు మరింత ఘాటుగా, నేరుగా రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
ఒకప్పుడు జగన్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన షర్మిల, 2019 ఎన్నికల ముందు తన అన్నకు అండగా నిలిచారు. ఆయన జైలులో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి “జగనన్న వదిలిన బాణం”గా ప్రచారం చేశారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ప్రత్యేకించి వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత ఈ విభేదాలు మరింత ముదిరాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో రాజకీయంగా దూరం పెరిగింది. వైఎస్ విజయమ్మ కూడా అప్పట్లో తన కుమార్తె షర్మిలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. ఆ తర్వాత షర్మిల తన రాజకీయ ప్రస్థానాన్ని వేరుగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎక్కడ అవకాశం దొరికినా జగన్పై విమర్శలు చేయడంలో షర్మిల వెనుకడుగు వేయడం లేదు. తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, జగన్ ఈ వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొత్తంగా అన్నాచెల్లెళ్ల మధ్య సాగుతున్న ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



