ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది.
అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. ఇప్పటికే అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి చట్టబద్ధత బిల్లు చట్టంగా మారనుంది. మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ బిల్లుపై చర్చలో పాల్గొనగా.. 10 పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారు.


