విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్లో కుటుంబంతో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన అప్పు ఇచ్చిన వ్యక్తులు అతని ఇంటికి వచ్చి డబ్బులు అడగడంతో రామిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు రామిరెడ్డి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ఈ ఘటనపై కసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


