నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు!
పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టు
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి
గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో…. బారికేడ్లను తోసుకుంటూ, పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో నిన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్ పై కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.మరోవైపు, చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ జరగనుంది. అంబటికి సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణ ఉండటంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.


